AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌, కేటీఆర్‌ రాజీనామా చేయాల్సిందే

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నేతల బృందం గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేసింది. శనివారం ఉదయం రాజ్‌ భవన్‌ కు వెళ్లిన బీజేపీ నేతలు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ తోపాటు సభ్యులను తొలిగించి కొత్త కమిషన్‌ ను నియమించాలని కోరుతూ గవర్నర్‌ కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌ ను కలిసిన వారిలో బూర నర్సయ్య గౌడ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, మర్రి శశిధర్‌ రెడ్డి, రాంచందర్‌, విఠల్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ఐటీ మంత్రి కేటీఆర్‌ లు తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలన్నారు. రద్దు చేసిన పరీక్షలను ఆలస్యం చేయకుండా వెంటనే నిర్వహించాలని, నియంత ప్రభుత్వాన్ని కూల్చేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ హయాంలో పోటీ పరీక్షలపై విద్యార్థులకు విశ్వాసం పోయిందన్నారు. పరీక్షలు కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. నాలుగు పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయంటే ప్రభుత్వ పనితనం కనిపిస్తోందని విమర్శించారు.ఇది కావాలని చేశారా?, యాదృచ్చికంగా జరిగిందా అని ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ANN TOP 10