మోహనియా: ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లో భాగంగా బీహార్ లోని మోహనియాలో యువతను ఉద్దేశించి రాహుల్ గాంధీ శుక్రవారంనాడు మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యువతను కాంట్రాక్ట్ లేబర్లుగా మారుస్తోందన్నారు.
”వాళ్లు (కేంద్రం) భారత రక్షణశాఖ బడ్జెట్ను జవాన్ల శిక్షణ, భద్రత కోసం ఉపయోగించడం లేదు. మిమ్మల్ని (యువతను) ఆర్మీలో కానీ, రైల్వేలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో రిక్రూట్ చేయడం లేదు. ఎందుకని? మిమ్మల్ని కాంట్రాక్టు లేబర్లుగా చేయలన్నదే వారి ఉద్దేశం” అని అన్నారు. అగ్నివీర్ అనే పేరుపెట్టి యువతను కాంట్రాక్టు లేబర్లుగా మార్చారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కనీసం సమాచారం ఇవ్వకుండా, పెన్షన్, సాయం లాంటివేవీ లేకుండా తొలగించేస్తారని అన్నారు.
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారంనాడు పాల్గొన్నారు. ససరామ్లో జరిగిన యాత్రలో తేజస్వి యాదవ్ స్వయంగా జీపు నడపగా, రాహుల్, ఇతర నేతలు అందులో కూర్చుని ముందుకు సాగారు. ‘ఇండియా’ కూటమితో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్న తర్వాత తేజస్వి యాదవ్, రాహుల్ ఒకే స్టేజ్పై కనిపించడం ఇదే మొదటిసారి. బీహార్ నుంచి న్యాయ్ యాత్ర గురువారంనాడు ఉత్తరప్రదేశ్లోకి అడుగుపెడుతోంది.









