AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఒకే రోజే 29 మందిపై దాడి..

తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ.. వచ్చిపోయేవారిపై దాడి చేస్తూ గజగజా వణికిస్తున్నాయి. ఒక్క రోజే.. మొత్తం 29 మందిపై దాడి చేసి.. రక్తం కళ్లచూశాయి. అయితే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒకే కుక్క 14 మందిపై దాడి చేయగా.. బాసరలోనూ పలు వీధి కుక్కలు మొత్తం 15 మందిపై దాడి చేశాయి. దాడిలో గాయపడిన బాధితులందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అందరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.

మంగళవారం రోజున రాజేంద్ర నగర్ పరిధిలోని పోచమ్మ ఆలయం దగ్గర చాయ్ అమ్ముకుంటున్న రమేష్(35)తో పాటు అక్కడే ఆడుకుంటున్న కౌశిక్‌ కుమార్‌(4)పై పిచ్చి కుక్క దాడి చేసింది. స్థానికులు తరమటంతో.. అక్కడి నుంచి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌) మెయిన్‌ గేటు దగ్గరికి వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తోన్న సెక్యూరిటీ సిబ్బందిని కరిచింది. మళ్లీ అక్కడి నుంచి వెళ్లగొట్టటంతో.. మళ్లీ పోచమ్మ దేవాలయం వీధిలోకి వచ్చిన కుక్క.. ఆ దారి వెంట వెళ్తున్న ఎస్కే సింగ్‌, రామకృష్ణ, రమేశ్‌, శరత్‌ కుమార్‌, చెన్నయ్య, మల్లిక, ఆండాలు, నరేందర్‌, రాజ్‌వీర్‌, యాదగిరి, జాకీర్‌, రంగన్న, కౌశిక్‌ కుమార్‌, రాజును కరిచింది. వీళ్లందరికీ.. రాజేంద్రనగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌‌లో చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వసంత పంచమి సందర్భంగా బాసరకు ఓవైపు భక్తులు పోటెత్తుతుంటే.. మరోవైపు వారిపై కుక్కలు రెచ్చిపోయాయి. కనిపించిన వారిపై దాడి చేస్తూ రక్తం కళ్ల చూశాయి. మంగళవారం అర్ధరాత్రి పూట ఓ లాడ్జ్ దగ్గర ఉన్న నలుగురిని కుక్కలు కరిచాయి. ఆ తర్వాత మరో 11 మందిపై దాడి చేశారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏకంగా 15 మందిని కుక్కలు కరవటంతో భక్తులంతా వణికిపోతున్నారు.

ANN TOP 10