AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పద్మ పురస్కార గ్రహీతలకు ప్రభుత్వం సత్కారం.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు

పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిని సీఎం, మంత్రులు సన్మానించారు. తెలుగువారు ఈ ఏడాది మొత్తం 8 మంది పదర్మ పురస్కారాలకు ఎంపికైన విషయం తెలిసిందే.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఇతర మంత్రులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదును వారికి అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేసింది.

వీరిలో మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్‌ ప్రకటించింది. చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేళు ఆనందాచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్‌ సోమాలాల్‌, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ వరించాయి.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చాలా సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సత్కరించడం ఇదే తొలిసారని చిరంజీవి అన్నారు. ప్రభుత్వం తమను సత్కరించడం అవార్డు పొందడం కంటే సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు.

కాగా, చిరంజీవిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం కలిసి.. పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. అవార్డు ప్రకటన సందర్బంగా చిరంజీవి విందు ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి కొనియాడారు.

ANN TOP 10