కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కారుపై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన కారు ధ్వంసం అయింది. ఈ దాడితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. యాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్లోని మాల్దాకు చేరుకుంది. ఈ క్రమంలోనే అక్కడ భద్రతా లోపం తలెత్తింది. అక్కడ నిర్వహించిన ర్యాలీలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. రాహుల్ గాంధీ కారుపై వెనక నుంచి రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది చేరుకునే లోపే ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.
దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా.. పగిలిన కారు అద్ధాలతోనే ఆయన ర్యాలీని ముందుకు సాగించారు. ఆ తర్వాత కారులోంచి దిగి బస్సులోకి ఎక్కారు. ఇక అక్కడ ఉన్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు శాంతింపజేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రాహుల్ గాంధీ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన నుండి వరుసగా భద్రతా లోపాలు తలెత్తడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.









