లండన్: మూసీ నదికి పునర్ వైభవం వస్తే హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని లండన్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గానూ థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు. మూసీ పరివాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
భారతీయ భాషల్లోనే స్టడీ మెటీరియల్: స్కూల్స్, విద్యా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు మరోవైపు, హైదరాబాద్లో మూసీ, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి చెరువుల ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులపై థేమ్స్ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీకి పునర్ వైభవం వస్తే.. నది, చెరువులతో హైదరాబాద్ మరింత శక్తిమంతమవుతుందని చెప్పారు. మూసీ విజన్ 2050కి స్పందించిన పోర్ట్ ఆఫ్ లండన్ టీమ్ పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అంతేగాక, భవిష్యత్తులో మరిన్ని చర్చలు, భాగస్వామ్యానికి సిద్ధమని పేర్కొంది.
కాగా, లండన్ నగరంలోని థేమ్స్ నది తరహాలో మూసీ నదిని అభివృద్ది చేయాలని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగర సుందరీకరణతోపాటు కాలుష్యం కోరల నుంచి హైదరాబాద్ను బయట పడేయొచ్చని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అంతకుముందు దావోస్ పర్యటనలో దిగ్గజ కంపెనీల నుంచి తెలంగాణ రాష్ట్రం భారీగా పెట్టుబడులను ఆహ్వానించింది. అదానీ గ్రూప్, టాటా సన్స్, తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.









