అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆయన స్వయంగా చీపురు పట్టుకుని నాసిక్ లోని కాల రామ మందిరాన్ని శుభ్రం చేశారు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛతా అభియాన్ ఊపందుకుంది. రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుక వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాల్లో మంత్రులు ముందుకు తీసుకెళ్తున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. రెండో రోజు రామయ్య నగర వీధుల్లో విహరించనున్న వేళ.. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పలువురు హిందువులు, నేతలు , రామ భక్తులు దేశంలోని హిందూ ఆలయాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి కిషన్రెడ్డి కూడా ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి ఆలయాన్ని స్వయంగా శుభ్రం చేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు ముందు దేశంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేపట్టాలని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘రామజ్యోతి’ వెలిగించి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నాను’ అని కిషన్ రెడ్డి చెప్పారు.









