తెలంగాణలో ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మరో 26మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న శాఖల నుంచి వేరే శాఖలకు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేయబడిన ఐఏఎస్ అధికారుల్లో గతంలో సీఎంవోలో అదనపు కార్యదర్శిగా పని చేసిన స్మితా సబర్వాల్ తో పాటు భారతి హోలికేరి వంటి అధికారులను బదిలీ చేశారు.
18గంటలు పని చేయకపోతే ..
పాలకులం కాదు సేవకులం అనే నినాదంతో పరిపాలన కొనసాగిస్తోంది నూతన ప్రభుత్వం. ఇందులో భాగంగానే తమకు అనుకూలంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యేలా చూసే సమర్ధవంతమైన అధికార యంత్రాంగాన్ని మెయిన్ స్ట్రీమ్ లో ఉంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ పదవి ఐదేళ్ల కాలం ఉండేది కాదని..ప్రజలకు అన్నీ వేళలా సహాయ, సహకారాలు, సేవలు అందించాలని రోజుకు 18గంటలు పని చేయాలని ఆదేశించారు. ఆ విధంగా చేయని వాళ్లకు వేరే చోటికి బదిలీ చేస్తామని చెప్పడం కూడా జరిగింది.









