వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల కుమారుడు రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజారెడ్డి పెళ్లి ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో జరగనుంది. ఈ నేపథ్యంలో, షర్మిల నేటి సాయంత్రం తనయుడు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియతో కలిసి ఇడుపులపాయ చేరుకున్నారు. అక్కడ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. తనయుడి పెళ్లి పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచిన షర్మిల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారితో వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు.









