సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్ మెట్రో రైల్వేపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో మార్గం ప్రణాళికలపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎయిర్పోర్టుకు మెట్రోను రద్దు చేయటం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్టు తెలిపారు.విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టుకు 32 కిలోమీటర్లు ఉంటుందన్న సీఎం రేవంత్.. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ను లింక్ చేస్తామని వెల్లడించారు.
అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని రేవంత్రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని న్యూ ఇయర్ రోజున మీడియా ప్రతినిధులకు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. మెట్రో విస్తరణ, కొత్త మార్గాలపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.
సమీక్షించిన అంశాలు..
ఐదు సెక్టార్లలో హైదరాబాద్ మెట్రో అభివృద్ధికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు మెట్రో ఫేజ్ -2 పై అధ్యయనం పై త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.









