అంబర్పేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సి.రోహిన్రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్షల కోట్ల అవినీతి, మద్యం స్కాంలో ఎమ్మెల్సీ కవిత కుంభకోణం చేశారని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొంటున్నారు కానీ, వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అంబర్పేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సి.రోహిన్రెడ్డి(Dr. C. Rohin Reddy) ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని, ఆ పార్టీల లోపాయికారి ఒప్పందం బహిర్గతమైందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లకుంట డివిజన్లోని చైతన్యనగర్, తిలక్నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటికకీ వెళ్లి చెయ్యి గుర్తుకు ఓట్లు వేయాలని డాక్టర్ సి.రోహిన్రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. నల్లకుంట డివిజన్ మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవీరమేష్ దంపతుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.రోహిన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో అంబర్పేట నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పే గులాబీ నేతలను నమ్మొద్దన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గరిగంటి రమేష్ మాట్లాడుతూ.. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. బతుకమ్మకుంటలోని బొందలగడ్డను నాలుగు కోట్లకు అమ్మివేశాడని ఆరోపించారు. కాలేరు వెంకటేశ్ నియోజకవర్గంలోని ఎన్నో భూములను కబ్జా చేశాడని ఆరోపించారు.









