ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ రావు, ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న విశ్రాంత అధికారి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 15, 16వ తేదీల్లో తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీ సత్యనారాయణ కూడా తిరుమలలో కనిపించారు. ఈ ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు.
తెలంగాణ సీఈవో నివేదిక ఆధారంగా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా ఇద్దరు అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈసీ తేల్చింది. దీంతో ఎండీ మనోహర్ రావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎంసీసీ నిబంధనల ఉల్లంఘన కింద శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఓఎస్డీ సత్యనారాయణను విధుల నుంచి తప్పించారు. ఇద్దరు అధికారుల కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిని ఈసీ ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19వ తేదీ మూడు గంటల్లోగా నివేదించాలని ఈసీ నోటీసులో పేర్కొంది.









