AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల

తెలంగాణలో మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతాపార్టీ మ్యానిఫెస్టోను శనివారం విడుదల చేయనున్నారు. మోదీ గ్యారంటీ పేరుతో మ్యానిఫెస్టోను బీజేపీ విడుదల చేయనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేస్తారు. రైతులు, సామాన్యులే లక్ష్యంగా ఈ మ్యానిఫెస్టో ఉంటుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. విద్య, వైద్యానికి మ్యానిఫెస్టోలో బీజేపీ అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అందరికి విద్య, అందరికీ ఉచిత వైద్యం అనే నినాదాన్ని ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టిగా వినిపించబోతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ వ్యక్తికి జీవిత బీమాతో పాటు ఆయుష్మాన్‌ భారత్‌ కింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇవ్వనుంది.

అలాగే వరి మద్దతు ధర క్వింటాలుకు 3100 చేస్తామనే భరోసా రైతులకు ఇవ్వబోతోంది. పంటల బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తామనే హామీ కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ఉందని సమాచారం. తెలంగాణలో ప్రతీ వివాహిత మహిళకు ఏటా 12 వేల రూపాయలు, వ్యవసాయ కార్మికులకు ఏటా 20 వేల ఆర్థిక సాయం అందించనుంది. కుటుంబాలపై భారం తగ్గించేందుకు 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామనే వాగ్దానం కూడా కమలనాథులు చేయబోతున్నారు. తక్కువ ధరకు ఔషధాలు అమ్మే జనఔషధి కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించే సూచనలున్నాయి.

ఇక యువతను ఆకర్షించేందుకు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామనే మాట కూడా ఇవ్వబోతోంది. అంతే కాదు ప్రతీ నెలా మొదటి వారంలోనే ఉద్యోగానికి ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వృత్తి విద్యలో అత్యున్నత సంస్థలైన ఎయిమ్స్‌, ఐఐటీ వంటివి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని మాట కూడా తెలంగాణ ఓటర్లకు బీజేపీ ఇస్తుందని సమాచారం. గూడులేని నిరుపేదలకు ప్రధానమంత్రి అవాస్‌ యోజన కింద ఇళ్లు, అలాగే చిరువ్యాపారులు, చేతివృత్తిదారులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామనే భరోసా కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో ఉంటుందని తెలుస్తోంది. మహిళా సంఘాలు, రైతులకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తామని బీజేపీ పేర్కొంటోంది.

ANN TOP 10