గిరిపల్లెలు, గూడాల్లో విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం
అపూర్వ స్వాగతాలు, మహిళల మంగళహారతులు
జోగు రామన్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు
ఆదిలాబాద్: తనను ఎదుర్కొలేకనే కుట్రలు పన్నుతున్నారని, ప్రజల నుండి వస్తున్న ఆదరణ, స్పందన చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని పిప్పల్ధరి, దహిగూడ, మామిడిగూడ, లింగుగూడ, వాన్వాట్, మొలాల్గుట్ట, సాలేగూడ, లోహర, మామిడికోరి, చిన్న లోకారి, పెద్దలోకారి, చించుఘాట్, కొత్తూర్, తంతోలి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆరు గ్యారంటీ హామీలపై వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్లారు. ఆదివాసీలు, పల్లెవాసులు ఆయనకు గుస్సాడీ నృత్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు నుదుటన తిలకం దిద్ది మంగళహారతలు పట్టారు. డప్పుచప్పుళ్ల మధ్య తమ గ్రామాలకు సాదరంగా ఆహ్వానించారు. దీంతో ఎక్కడా చూసినా జనప్రభంజనం కన్పించింది.

ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నపై, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దోచుకో..దాచుకో అన్నరీతిలోనే జోగు రామన్న వ్యవహరం ఉందని ధ్వజమెత్తారు. పోడు భూముల విషయంలో ఆదివాసీలను నమ్మించి మోసం చేశారని అన్నారు. పెళ్లయిన కొత్త జంటలకు కనీసం రేషన్ కార్డు కూడా ఇప్పించలేదని మండిపడ్డారు. పంట మార్పిడితోనే అధిక దిగుబడులు సాధించినట్లు అధికార మార్పిడి ద్వారానే అభివృద్ది సాధించుకుందామని తెలిపారు.
సంక్షేమ పథకాల పేరుమీద తనవారికి లాభం చేకూర్చిన జోగు రామన్న అర్హులైన ప్రజలను నిలువునా ముంచాడని ఆరోపించారు. బ్యాంకు రుణాలులేవని, రైతు రుణమాఫీ జరగలేదని, విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇప్పించలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రిమ్స్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడన్నారు. ధైర్యంగా ఎదుర్కొలేకనే
కాంగ్రెస్ ఓట్లు చీల్చటానికి సంజీవరెడ్డిని పోటీ చేయిస్తున్నారని విమర్శించారు.గిరిజన పల్లెలు, గూడాలకు ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యంలేక నానా అవస్థలు పడుతున్నారని, ఈ పాపం పాలకులది కాదా అంటూ నిలదీశారు.
తనను ఆశీర్వదించి ఒక్క అవకాశం కల్పిస్తే ఆదిలాబాద్ రూపురేఖలు మారుస్తానని, తయారీ పరిశ్రమలు రప్పించి వేలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మార్పు రావాలంటే..కచ్చితంగా కాంగ్రెస్ రావాలంటూ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ హామీల అమలుకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. వివాహమైన ప్రతి మహిళకు నెలకు 2500లు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. వృద్దులందరికీ నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు. అన్ని హామీలను పక్కాగా అమలు చేస్తామని భరోసా కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.









