తెలుగు చిత్రసీమలో గొప్ప నటుల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రమోహన్ శనివారం నాడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె రావాల్సి ఉండడంతో ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రమోహన్ పెద్ద కుమార్తె నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో, సోమవారం హైదరాబాదులోని పంజాగుట్ట శ్మశాన వాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రమోహన్ నివాసం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. మధ్యలో తెలుగు ఫిలిం చాంబర్ వద్ద కొద్దిసేపు ఆపుతారని వార్తలు వస్తున్నప్పటికీ, ఆ వార్తలను చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఖండించారు. పరిశ్రమలో ఉన్నవారు చాలామంది ఇంటికే వచ్చి నివాళులు అర్పించారని, ఇప్పటికే రెండ్రోజుల సమయం గడిచిందని, అందువల్ల నేరుగా శ్మశానవాటికకు తరలిస్తున్నట్టు వారు వివరించారు.









