ఛత్తీస్గఢ్లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చోటుచేసుకుంది. మొత్తం 90 స్థానాలకు గాను.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 సెగ్మెంట్లలో మంగళవారం మొదటి దశ పోలింగ్ జరగ్గా.. సుకుమా, నారాయణ్పూర్, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో నక్సల్స్ హింస చోటుచేసుకుంది. ఈ జిల్లాల్లోని మూడు చోట్ల నక్సల్స్-పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు జవాన్లు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. పొటకపల్లి వద్ద మావోయిస్టులు రహదారిపైకి కాల్పులు జరిపారు. సుక్మా జిల్లాలో పోలింగ్కు విఘాతం కలిగించేందుకు పలుచోట్ల మావోయిస్టులు విధ్వంసకర సంఘటనలకు పాల్పడ్డారు. పోలీసులు వారి చర్యలను సమర్థంగా తిప్పికొట్టారు. తొండమరక సీఆర్పీఎఫ్ క్యాంపస్ వద్ద ఒక ఐఈడీ పేలిన ఘటనలో ఓ కమాండో తీవ్రంగా గాయపడ్డారు. సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్లో 70.87% మేర పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
మిజోరంలో 77.39%
మిజోరంలోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు మంగళవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, 77.39% ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. తుది నివేదికలు వచ్చాక.. పోలింగ్ శాతం 80కి పెరిగే అవకాశాలున్నట్లు చెప్పారు. కాగా.. మిజోరం సీఎం జోరమ్థంగా మంగళవారం ఉదయం 7.30కు ఓటు వేసేందుకు వెళ్లగా.. ఆ పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించింది.









