243 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే వరుసగా ఏడు విజయాలతో టేబుల్ టాపర్ గా ఉన్న టీమిండియా తాజాగా మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం (నవంబర్ 5) దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన ఏకంగా 243 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. 327 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లే ఆడి 83 పరుగులకు ఆలౌటయ్యింది.
మార్కొ జాన్సెన్ చేసిన 14 పరుగులే ఆ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. డికాక్ (5), బవుమా (11), ర్యాస్ వానెడర్ వాసెన్ (13), ఐడెన్ మర్క్రమ్ (9), హెన్రిచ్ క్లాసెన్ (1), డేవిడ్ మిల్లర్ (11), కేశవ్ మహరాజ్ (7), కగిసో రబాడా (6), లుండి ఎంగిడీ (0), థర్బైజ్ షంసీ (4) ..ఇలా అందరూ ఇలా వచ్చి అలా పెవిలియన్కు వెళ్లిపోయారు. భారత్ బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా నడ్డీ విరిచాడు. ఇక షమి, కుల్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడనుంది. నవంబర్ 12న ఈ మ్యాచ్ జరగనుంది. ఇక పుట్టిన రోజు సెంచరీతో చెలరేగి భారత్కు భారీ స్కోరు అందించిన విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
వారం రోజుల తర్వాత ఆఖరి లీగ్ మ్యాచ్..
కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీస్ తో తలపడనుంది రోహిత్ సేన.









