మేడ్చల్ జిల్లా రాజ బొల్లారం మండలం అక్బర్ జాపేట్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ అతని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. మేడ్చల్ మండలం అక్బర్ జాపెట్ గ్రామానికి చెందిన గౌస్ ఆర్ఎంపీ డాక్టర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శామీర్ పెట్లో నివాసం ఉండే అతని బామ్మర్దులు బుధవారం (నవంబర్ 1) అర్ధరాత్రి గౌస్ ఇంటికి వచ్చారు. భూ వివాదంలో వారి మధ్య వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో మాట మాట పెరిగి పెను విధ్వంసానికి దారి తీసింది. క్షణికావేశంలో గౌస్ బామ్మర్దులు కర్రతో అతని తలపై బాది తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న కత్తితో గౌస్ను విచక్షణారహితంగా పొడిచారు. ఈ దాడిలో గౌస్ కుప్పకూలాడు. స్థానికులు గమనించి వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. అయితే గౌస్ను పరీక్షించిన వైద్యులు, గౌస్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు.
గౌస్ సొంత బామ్మర్దులైన సయ్యద్ లతీఫ్, హసీనా బేగం, సయ్యద్ ముబీన్, మెహర్ ఉన్నిసా, సయ్యద్ అల్తాఫ్ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. గౌస్ హత్యకు భూ వివాదం కారణమని పోలీసులు గుర్తించారు. గౌస్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు.