నిన్న ఓ చానెల్ టిబెట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్.. బీజేపీ నేత శ్రీశైలం గౌడ్ పై దాడి చేశారు. ఈ దాడిని బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఖండించారు. గురువారం జీడిమెట్లలో గల షాపూర్లోని కూన శ్రీశైలంగౌడ్ ఇంటికి వెళ్లి శ్రీశైలం గౌడ్ను పరామర్శించి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ నిన్న జరిగిన సంఘటనలో తప్పతాగి వచ్చి గొడవకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. అంబేడ్కర్ రాజ్యాంగం కావాలా లేక కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా అని నిలదీశారు. శ్రీశైలంపై దాడిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసికెళ్తాం. ఈ ఎన్నికల్లో వివేకానందగౌడ్ను అనర్హుడుగా ప్రకటించాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మీడియా పార్టీల వారిగా విడిపోయింది. ప్రజలు మాత్రం బీజేపీ పార్టీ పక్షాన ఉన్నారు. ఆ ఎమ్మెల్యే పేరు వివేకానంద – బుద్దులు మాత్రం ఔరంగజేబులా ఉన్నాయి.
సర్వేలన్నీ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రశ్నిస్తే దాడులా, శ్రీశైలంపై దాడి ప్రజలపై దాడి. అక్రమంగా సంపాదించిన డబ్బులు వెదజల్లి గెలుస్తాననే అహంకారంతో సంస్కారహీనంగా వివేకానందగౌడ్ ప్రవర్తన ఉంది. ఎలాంటి దాడులైన పేదల కోసం బీజేపీ భరిస్తుంది. ప్రజల సమస్యల కోసం ప్రశ్నించిన వారిపై దాడులు చేసే BRS నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు. కండకావరంతో దాడి చేసిన వివేకానందగౌడ్ను ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలి. కబ్జాలు చేసే వారిని ఈ ఎన్నికల్లో బహిష్కరించాలి. కుత్బుల్లాపూర్ ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి’’ అని బండి సంజయ్ అన్నారు.









