రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్: ప్రజలను ఇన్నాళ్లు మభ్యపెడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరించిన జోగు రామన్నకు సరైనరీతిలో గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్, వాల్మీకినగర్తోపాటు చాందా(టి), భోరజ్ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం విస్తృతంగా పర్యటించారు. జైనథ్ మండలం భోరజ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. చాందా-టి గ్రామంలో శారదా మాత మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అటు పట్టణంలోని రాంనగర్, వాల్మీకినగర్లో మండపాలను దర్శించుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. బతుకమ్మలను సందర్శించి మహిళలతో కలిసి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డిపై పూలవర్షం కురిపిస్తూ కాలనీవాసులు అపూర్వ స్వాగతం పలికారు. శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే జోగు రామన్న తీరును ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ముమ్మాటికీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.










