తెలంగాణలో తాము 24 గంటల విద్యుత్తు ఇస్తున్నామని, కాంగ్రెస్ సర్కారు ఏర్పడితే మళ్లీ పాత రోజులు వస్తాయని మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. లాగ్ బుక్ లు తీసుకొచ్చి 24 గంటల విద్యుత్తు ఇస్తున్నామని కేటీఆర్ నిరూపించాలని సవాలు విసిరారు.
ఆ పని చేస్తే తెలంగాణ ప్రజల కోసం కరెంట్ తీగలను పట్టుకోవడానికి సిద్ధమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గృహలక్ష్మి పేరుతో మహిళలకు రూ.3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ దాన్ని గాలికి వదిలేశారని చెప్పారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలన్నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమేనని విమర్శించారు.
తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రెండు నెలలు కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆలేరుకు తాను స్థానిక ఎమ్మెల్యే కంటే ఎక్కువసార్లు వచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని అన్నారు. అయితే, ఇప్పటికీ బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని చెప్పారు. కేసీఆర్ బండారాన్ని మోదీ బయటపెట్టారని తెలిపారు.









