పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం ప్రకటించింది. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను గురువారం విడుదల చేయనున్నట్లు నియామక బోర్డు పేర్కొంది. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను గురువారం పోలీస్ నియామక మండలి వెబ్ సైట్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఖాళీగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి విదితమే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేశారు. పలు విభాగాల్లో 16,604 పోస్టులకు గాను 15,750 మంది ఎంపికైనట్టు పోలీస్ నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టులో కేసుల కారణంగా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు పేర్కొంది.
పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని వెల్లడించింది. తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోలీస్ నియామక బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహించారు. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. ఇందులో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారని బోర్డు తెలిపింది. తెలంగాణ పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ (సివిల్/ఎ.ఆర్/ టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఏప్రిల్ 30న తుది రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 98.53 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి(టిఎస్ఎల్పిఆర్బి) పేర్కొంది.









