విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరున ముద్రించిన రూ.100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు సినిమాకి ఎన్టీఆర్ చేసిన సేవల్ని స్మరించుకున్న రాష్ట్రపతి.. రాముడు, శ్రీకృష్ణుడు ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించారు. సీనీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఎనలేని సేవలు అందించారని ద్రౌపది ముర్ము మెచ్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి మాజీ సీఎం చంద్రబాబు , బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఒక తరానికే కాకుండా.. తరతరాల వారికి హీరో అన్నారు పురంధేశ్వరి. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగించిందనీ.. ఆయన కూతురిగా ఇది తన అదృష్టం అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఎందరికో ఆదర్శం అని తెలిపారు.









