పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తోషాఖానా కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పు వెలువరించింది. అక్రమ పద్ధతిలో ఇమ్రాన్ బహుమతుల్ని అమ్ముకున్నట్లు తేల్చారు. ఇమ్రాన్కు ఈ కేసులో లక్ష రూపాయాల జరిమానా విధించారు. ఇమ్రాన్పై నమోదు అయిన ఆరోపణలు రుజువైనట్లు శనివారం విచారణ సమయంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హుమాయున్ దిలావర్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఇమ్రాన్ కావాలనే తప్పుడు వివరాలను వెల్లడించినట్లు కోర్టు తెలిపింది. ఎలక్షన్ చట్టంలోని 174వ సెక్షన్ ప్రకారం కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల అమలు కోసం కాపీ ఆర్డర్ను ఇస్లామాబాద్ పోలీసు చీఫ్కు పంపించాలని జడ్జి దిలావర్ తెలిపారు.









