వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. భారీ వరద ఉధృతి పోతెట్టడంతో పోతన నగర్ వైపు ఉన్న కట్ట ఆకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో చెరువులోని నీరంతా ఉదృతంగా బయటకు ప్రవహిస్తుంది. సరస్వతీనగర్, పోతననగర్, రంగంపేట, కాపువాడ, 9 డివిజన్, మున్నురుకాపు ఏరియా కాలనీలపై వైపు వేగంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి స్థానిక ఏవీ కాలేజీలో పునరాసకేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరవులు, కుంటలు నిండిపోయి అలుగు పోస్తున్నాయి. జలాశయాలు నిండు కుండలా మారాయి. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరగటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి పూర్తిగా నీటమునిగిపోయింది. గ్రామంలోని ప్రజలు సర్వం కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మెుత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతు కాగా.. వారి ఆచూకీ లభ్యం కాలేదు. భారీ వర్షాలు అపారనష్టాన్ని మిగిల్చాయి.









