AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏ ఒక్కర్ని వదిలిపెట్టం.. మణిపూర్‌ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ.. మణిపూర్ ఘటన దేశానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నిందితులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో చర్చించేందుకు అన్ని పార్టీల నేతలు.. సంయమనంతో ఉండాలని కోరారు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఒక్క ఘటన భారతీయులందరినీ సిగ్గుపడేలా చేసింది. ఆ మణిపూర్‌ మహిళలకు జరిగిన ఘోరాన్ని ఎప్పటికీ క్షమించలేం. మహిళల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నటికీ రాజీపడదు. ఈ ఘటనకు కారణమైన నిందితులను విడిచిపెట్టేది లేదని దేశ ప్రజలకు భరోసాను ఇస్తున్నాను. మణిపూర్‌లో జరిగిన దారుణ ఘటనపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించాలి. ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షించేందుకు చట్టం అన్ని రకాలుగా పనిచేస్తుంది’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. సభలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని.. అన్ని బిల్లులపై చర్చ జరగాలని కోరారు. ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.

ANN TOP 10