బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు. తెలంగాణతో పాటు త్వరలో ఎన్నికలు జరగునున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్గఢ్ రాష్ట్రాల్లోనూ బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగానే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు అధికారికంగా 26 పార్టీల I.N.D.I.A కూటమి ఏర్పాటు, అధికార బీజేపీ నేతృత్వంలోని 38 పార్టీల ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించిన ఒక రోజు తర్వాత.. బీఎస్పీ చీఫ్ మాయావతి తన పార్టీ ఏ పక్షంతోనూ కలిసి వెళ్లదని, రెండింటికీ దూరంగా ఉంటుందని, రానున్న ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తుందనన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విధమైన ప్రకటన చేశారు. అయితే హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందన్నారు.









