AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎట్టకేలకు తిరుపతి రెడ్డి ఆచూకీ లభ్యం

మిస్సింగ్‌ కేసు సుఖాంతం
ఆచూకీని కనుగొన్న పోలీసులు
బీజేపీ నేత, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తిరుపతి రెడ్డి మిస్సింగ్‌ కేసు సుఖాంతమైంది. ఈ నెల 13న హైదరాబాద్‌లో అదృశ్యమైన తిరుపతి రెడ్డి.. ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. విజయవాడలో ఉన్నట్టు గుర్తించిన తిరుపతి రెడ్డిని.. తిరిగి హైదరాబాద్‌ తీసుకొస్తున్నారు. అయితే.. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య.. తిరుపతి రెడ్డి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించగా.. అందులో తిరుపతిరెడ్డి గురువారం(జులై 13న) అల్వాల్‌ తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర తన కారు దిగి.. ఆటో ఎక్కినట్టు గుర్తించారు. అయితే.. ఆటో నెంబర్‌ ఆధారంగా దాని డ్రైవర్‌ను పట్టుకుని విచారించగా.. రూ.700 ఇచ్చి ఘట్‌కేసర్‌లో దిగిపోయినట్టు తెలిసింది. అక్కడి నుంచి ఎటు వెళ్లాడన్నది.. మిస్టరీగా మారింది. కాగా.. ఈ కేసులో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఓల్డ్‌ అల్వాల్‌లోని 566, 568ఆ, 571 సర్వే నెంబర్ల పరిధిలో తిరుపతి రెడ్డికి కోట్ల విలువ చేసే స్థలాలు ఉండగా.. అందులోని ఎకరంన్నర భూమి పంపకాల్లో మామిడి జనార్దన్‌రెడ్డితో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో స్థానిక పోలీసులు జనార్దన్‌ రెడ్డికే సపోర్ట్‌ చేస్తున్నారని ఉన్నతాధికారులకు తిరుపతి రెడ్డి కంప్లైంట్‌ కూడా చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి రెడ్డి మిస్సింగ్‌ కావడం చర్చకు దారి తీసింది. అధికార పార్టీ నేతలే తన భర్తను కిడ్నాప్‌ చేశారంటూ తిరుపతిరెడ్డి భార్య సుజాత ఆరోపించారు కూడా.

ఇదిలా ఉంటే.. తిరుపతి రెడ్డిని పోలీసులు విజయవాడలో ఉన్నట్టు కనిపెట్టారు. అయితే.. ఆయన ఈ ఐదు రోజులు ఎక్కడున్నారు.. ఎవరైనా కిడ్నాప్‌ చేశారా.. లేదా ఆయనే స్వయంగా వెళ్లారా.. అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. తిరుపతి రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. అసలు ఏం జరిగింది అన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు.

ANN TOP 10