తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించనున్నారు. మరోవైపు.. బండి సంజయ్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరి పేర్లు దాదాపు ఖరారుకాగా.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. తెలంగాణ బీజేపీ పాలిటిక్స్ హస్తినాలో వాడీవేడీగా సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మెదక్ జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం మెదక్ జిల్లాలో పర్యటించిన రాజేందర్కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పోలిక లేదు. తెలంగాణ యువకులు, విద్యార్థులు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు అని అంటున్నారు. ఈసారి ఆరునూరైనా కేసీఆర్ను ఓడించి తీరుతాం. దెబ్బ కొడితే దిమ్మతిరగాలి. హుజురాబాద్లో ఎలాంటి తీర్పునిచ్చిందో తెలంగాణలో అలాంటి తీర్పు వస్తుంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ను మట్టిలో కలిపేస్తారు. ఆ పార్టీతో జతకడితే వారి పనిపోయినట్లే.
ఈ మూడేళ్లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలిచింది. దుబ్బాక, హుజురాబాద్లలో కాంగ్రెస్కు డిపాజిట్ పోయింది. బీఆర్ఎస్ పార్టీని, జిత్తుల మారి కేసీఆర్ను ఇంటికి పంపే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది. పంజాబ్, మహారాష్ట్ర రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారు. తెలంగాణలో కౌలు రైతులు చనిపోతే రూ. 5 లక్షలు ఇచ్చే దమ్ముందా..?. బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులు చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తాం’ అని ఈటల హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను ఓడగొట్టేందుకు ఆత్మగౌరవం సిద్ధంగా ఉంది. ప్రజా క్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం. కేసీఆర్ సర్కార్పై కొట్లాడటానికి అంకుటిత దీక్షతో బీజేపీ సిద్ధంగా ఉంది’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.









