AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి బీ టీం బీఆర్ఎస్

ఖమ్మం జన గర్జనలో రాహుల్ గాంధీ ప్రసంగం
తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే వస్తాయని ధీమా
ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జన గర్జన సభలో అగ్రనేత రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్‌ను కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసే ప్రతి పనిలోనూ అవినీతి ఉందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరత, మిషన్ కాకతీయ.. ఇలా చెప్పుకుంటూపోతే అన్ని పథకాల్లో అక్రమాలే జరిగాయని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. బీఆర్ఎస్ చేస్తున్న అవినీతి మొత్తం బీజేపీ ఏజెన్సీలకు తెలుసన్నారు. కేసీఆర్ అవినీతి పాలనకు మోదీ ఆశీస్సులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ బీ టీం బీఆర్ఎస్‌ పార్టీకి మధ్యే పోటీ జరుగుతుందని.. చెప్పుకొచ్చారు. బీజేపీ పని ఖతం అయ్యిందన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే రానున్నాయని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

“బీజేపీ బీ టీమ్‌తో కాంగ్రెస్ ఎలాంటి ఒప్పందాలు చేసుకోదు. మొన్న పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల మీటింగ్‌కు బీఆర్ఎస్‌ పార్టీని ఆహ్వానించాలని అన్నిపార్టీలు కోరితే మేం విభేదించాం. అందుకే ఆ మీటింగ్‌కు బీఆర్ఎస్‌ను ఆహ్వానించలేదు. కేసీఆర్ చేసిన అక్రమాలన్ని ప్రధాని మోదీకి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. డిల్లీ మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలున్న ఎందుకు అరెస్ట్ చేయలేదు. అందుకే బీఆర్ఎస్‌ను బీజేపీ బీ టీమ్ అంటున్నాం. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తెదార్ (బంధువుల) సమితి. బీఆర్ఎస్‌ను తెలంగాణలో కచ్చితంగా ఓడిస్తాం. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలొస్తాయ్. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బీటీమ్ మధ్యే పోరు నడుస్తుంది. చాలా మంది కాంగ్రెస్‌లో నుంచి వెళ్లిపోయారు. వాళ్లందరికీ ఒకటే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. అందురూ తిరిగిరావాలి.” అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే.. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చే హామీని కూడా రాహుల్ గాంధీ ప్రకటించేశారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ చేయగా.. ఇప్పుడు పింఛన్లపై కీలక ప్రకటన చేశారు రాహుల్. రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు 4000 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. బీజేబీ బీ టీం బీఆర్ఎస్‌ను ఓడించి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తామంటూ చెప్పుకొచ్చారు రాహుల్.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అభినందించారు. తెలంగాణలో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి బలహీనులకు భట్టి అండగా నిలిచారన్నారు. పేదలకు అండగా నిలిచిన భట్టి విక్రమార్కను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం చెప్తూనే.. అభినందనలు చెప్పారు రాహుల్ గాంధీ.

ANN TOP 10