AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈటల రాజేందర్ హత్యకు కుట్ర.. ఈటల జమున సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను హత్య చేసేందుకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తమకు తెలిసిందని జమున వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే కౌశిక్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆరోపించారు. ఈటలను చంపిస్తామంటే భయపడమని అన్నారు.

గవర్నర్‌ తమిళిసైపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని జమున హెచ్చరించారు. కేసీఆర్ తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని, కానీ తాము వాటిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. రూ.20 కోట్లు కాదని, ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్తారని విమర్శించారు. శాడిస్టులను పక్కన పెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

‘కౌశిక్ రెడ్డిని కేసీఆర్ హూజారాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారు. కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు. హుజూరాబాద్‌లో అమరవీరుల స్థూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలి. అమరవీరుల స్థూపాన్ని పడగొట్టించిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అమరవీరులను కేసీఆర్ కించపరుస్తున్నారు. మా కుటుంబసభ్యుల్లో ఎవరికి హాని కలిగినా కేసీఆర్‌నే కారణం. బీజేపీలో ఈటల రాజేందర్ సంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారను అని స్పష్టంగా చెబుతున్నారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను’ అని ఈటల జమున స్పష్టం చేశారు.

ANN TOP 10