ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నారు. అయితే, గతంలో కేటీఆర్ పలుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర మంత్రులను కలిసినా.. అమిత్ షాతో మాత్రం భేటీ కాలేదు. చాలా, రోజుల తర్వాత ప్రస్తుతం ఆయనను కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నా.. ఈ సమావేశంలో ఇతర రాజకీయ వ్యవహారాలూ చర్చకు వచ్చే అవకాశం ఉందని భోగట్టా. అయితే, ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు.
రసూల్పుర వద్ద చేపట్టిన రహదారి అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల కోసం అమిత్షాను కలిసే అవకాశం ఉంది. వరంగల్ వద్ద ఉన్న మామునూరు ఎయిర్పోర్టు అంశంపై పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా సహాయమంత్రి వీకే సింగ్లను కలుస్తారు.. హైదరాబాద్ మెట్రో పరిధి విస్తరణపై ఆ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.









