బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీహరిరావు.. ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ మేరకు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. ఉద్యమకారుల నమ్మకాలు బీఆర్ఎస్ వమ్ముచేసిందని మండిపడుతున్నారు. కూచాడి శ్రీహరిరావు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించి.. వారి సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తనను, తన అనుచరులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన తనకు, తన అనుచరులకు ఆహ్వానం పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కారు చోడో.. హత్ జోడో.. సాత్ ఛలో నినాదంతో నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్కు కొత్త ఊపిరి పోస్తామంటున్నారు కూచాడి శ్రీహరిరావు.









