AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మైనర్ల సోషల్ మీడియా వాడకం పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

సోషల్ మీడియా ఖాతాల వినియోగం అంశంలో మైనర్లపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం గురువారం నోటీసులు జారీ చేసింది. భారత కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్లు ఎటువంటి ఒప్పందాల్లోనూ భాగస్వాములు కాలేరని, అలాంటప్పుడు సోషల్ మీడియా ఖాతాలు తెరిచే సమయంలో ఆన్‌లైన్ ఒప్పందాలను వారు ఎలా అంగీకరిస్తారని పిటిషనర్ ప్రశ్నించారు.

జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై సమాధానమివ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, న్యాయ శాఖలను ఆదేశించింది. ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా వాదనలు వినిపిస్తూ, అమెరికాలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ సూర్యకాంత్, “భారత్‌లోనూ ఇటువంటి రక్షణ చర్యలు అవసరం ఉంది” అని వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి స్పందిస్తూ నియంత్రణ కోసం పటిష్ఠమైన ‘ఫైర్‌వాల్స్’ ఉండాలని అభిప్రాయపడ్డారు.

మైనర్లు సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించడం వల్ల ఆన్‌లైన్ గ్రూమింగ్, లైంగిక వేధింపులు, సైబర్‌ బుల్లీయింగ్, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం వంటి ముప్పులను ఎదుర్కొంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థలు వయసు నిర్ధారణ కోసం పటిష్ఠమైన యంత్రాంగాన్ని అనుసరించేలా, మైనర్లు సొంతంగా ఖాతాలు తెరవకుండా నిరోధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండే ఖాతాల ద్వారా విద్యా సంబంధిత కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

ANN TOP 10