AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్..!

టీడీపీ-జనసేన కేడర్ మధ్య ఏం జరిగింది? కావాలనే రెండు పార్టీల కేడర్‌ మధ్యలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయా? ఈ క్రమంలో మా అధినేత గొప్ప అంటే.. మా అధినేత గొప్ప అనుకునే స్థాయికి ఇరుపార్టీల కేడర్ వెళ్లిందా? జరుగుతున్న పరిణామాలను ఇరు పార్టీల అధినేతలు గుర్తించారా? కేడర్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.

ఏపీలో సోషల్ మీడియా వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. చిన్న విషయాల మధ్య టీడీపీ-జనసేన పార్టీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై జనసేన కార్యకర్తల పేరుతో కొందరు, పవన్ కళ్యాణ్-ఇతరులపై టీడీపీ కార్యకర్తల పేరుతో అనుచితమైన పోస్టులు పెడుతున్నారని ఈ రెండు పార్టీలు పేర్కొన్నాయి.

ఈ మేరకు టీడీపీ-జనసేనలు తమ పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశాయి. వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ప్రభుత్వ విధానాలు- ప్రతిష్ఠ దెబ్బతినేలా పోస్టులు చేస్తున్న కార్యకర్తలకు విజ్ఞప్తి చేశాయి. కూటమి పార్టీల ఐక్యతను కార్యకర్తలు కాపాడుకోవాలంటూ ఈ మేరకు ఇరు పార్టీలు ఎక్స్ వేదికగా ఓ పోస్టులు పెట్టాయి.

కొంతమంది వ్యక్తిగత కోపం, ఆవేశంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఈ విషయంలో పార్టీ ఆదేశాలు పాటించలేదని పేర్కొన్నాయి. కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించిన పార్టీలు, అలాంటి అవకాశం వైసీపీ ఇచ్చే పరిస్థితులు తీసుకురావొద్దన్నాయి. దీని కారణంగా ప్రభుత్వ పాలసీలు-అభివృద్ధి కార్యక్రమాలు-పరిపాలనపై సోషల్ మీడియాలో చేసే పోస్టులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశముందన్నాయి.

ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం విమర్శలకు దిగకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నాయి. అందరు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని, మన మధ్య మనమే పోరాడటం కాకుండా రాజకీయ ప్రత్యర్థి వైసీపీపై పోరాడటం చేయాలన్నాయి. కూటమి ఐక్యతను పరస్పర గౌరవాన్ని కాపాడుకోవడం బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందన్నారు.

జనసేన పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ పోస్టు చేసింది. చిరంజీవిని కొంతమంది టీడీపీ కార్యకర్తలు తిట్టినట్టుగా పోస్టులు పెట్టడం, దీనికి ప్రతీకారంగా సీనియర్ ఎన్టీఆర్‌ని కొంతమంది జనసైనికులు ట్రోల్ చేయడం జరుగుతోందని రాసుకొచ్చింది. ఇరు పార్టీల నాయకులు ప్రాతినిధ్యం వహించే శాఖల్లో అవగాహన లేకుండా లోపాలు ఎంచుకుని బురద చల్లడం మంచి కాదని తెలిపింది.

దయచేసి ఈ విషయంలో జనసైనికులు అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి, సోషల్ మీడియా విభాగం దృష్టికి తేవాలన్నారు. జనసైనికుల నుండి ఇప్పటివరకు వచ్చిన కొన్ని అంశాలు పార్టీ నాయకత్వం దృష్టికి తెచ్చినట్టు తెలిపింది.

ANN TOP 10