తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు షికారు చేస్తున్న వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గాంధీ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రుల శాఖలన్నింటినీ సమూలంగా పునర్వ్యవస్థీకరించి, కొత్త శాఖలను కేటాయించాలని తాను కాంగ్రెస్ హైకమాండ్కు స్పష్టమైన సూచన చేసినట్లు వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడిగా తన పరిధి మేరకు పార్టీ ప్రయోజనాల కోసం ఈ సలహా ఇచ్చానని… దానిపై తుది నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధిష్ఠానం చేతిలోనే ఉందన్నారు.
ఇక తనను మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై స్పందిస్తూ… ఆ విషయాలన్నీ అధిష్ఠానం నిర్ణయానికే వదిలేశానని తెలిపారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే బాధ్యత కలిగిన పీసీసీ అధ్యక్షుడిగా నిరంతరం పనిచేస్తున్నానని పేర్కొన్నారు.







