AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్‌లో పెరుగుతున్న ఉద్యోగాల సంక్షోభం..! ఉద్యోగం మారాలని ప్రతి ఇద్దరిలో ఒకరు..

భారత్‌లో ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ రంగంలో జనరేషన్‌ జెడ్‌ (జెన్‌-జీ) ఉద్యోగుల వాటా రెండింతలైంది. అదే సమయంలో ఉద్యోగులను సంస్థల్లో కొనసాగించుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లు ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ నివేదిక వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. ప్రస్తుత సంస్థను వీడాలని చూస్తున్న ఉద్యోగుల్లో నలుగురిలో ముగ్గురు వచ్చే 12 నెలల్లోనే బయటకు వెళ్లాలని భావిస్తున్నారు. 1.1 లక్షలకు పైగా ఉద్యోగులతో పనిచేస్తున్న 130కి పైగా సంస్థలపై అధ్యయనం చేసి ఈ వివరాలు వెల్లడించారు.

2023లో ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ రంగంలోని మొత్తం ఉద్యోగుల్లో జెన్‌-జీ వాటా 17 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 34 శాతానికి చేరింది. వేతనం, గుర్తింపు, పదోన్నతికి సంబంధించిన ప్రమాణాలపై స్పష్టత లేకపోవడాన్ని ఈ తరం ఉద్యోగులు పెద్దగా సహించడంలేదని నివేదిక తెలిపింది. తమ అంచనాలు నెరవేరకపోతే త్వరగా ఉద్యోగం మారే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది.

మరోవైపు.. ఫ్రంట్‌లైన్‌ మేనేజర్లు, సూపర్‌వైజర్లలో ఏకంగా 86 శాతం మంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో పనిచేసే ఉద్యోగుల్లో ఈ సంఖ్య 53 శాతంగా ఉంది. ప్రాజెక్టుల ఒత్తిడి, క్లయింట్ల డిమాండ్లు, బృందాలను చూసుకోవడం వంటి బాధ్యతలు మేనేజర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది.

సంస్థల్లో పని పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నా.. ఉద్యోగులు తమ బాధ్యతలకు మించి పనిచేయాలనే ఆసక్తి మాత్రం క్రమంగా తగ్గుతోందని తెలిపింది. దీర్ఘకాలిక అనుబంధం కోసం భౌతిక సదుపాయాల కంటే సంస్థాగత, సాంస్కృతిక మార్పులు అవసరమని వివరించింది.

ఇక దాదాపు 60 శాతం సంస్థలు రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయి. అయితే ఏఐ సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలపై తమకు తగిన సమాచారం అందిందని కేవలం 20 శాతం మంది ఉద్యోగులే బలంగా అంగీకరించారు.

ANN TOP 10