ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం రెడీ అవుతోంది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. అదే దారిలో వైసీపీ కూడా అడుగులు వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ తరపున బలమైన అభ్యర్థులను దించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
సెప్టెంబర్ లేకుంటే అక్టోబర్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా కీలక నేతలను అలర్ట్ చేశారు వైసీపీ అధినేత జగన్. మంగళవారం పార్టీ ఆఫీసులో నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమేనని అన్నారు.
మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్, మేయర్ స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని సూచన చేశారు. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు బలం వస్తుందన్నారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబసభ్యులను పోటీకి దింపడానికి వెనకాడవద్దన్నారు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలన్నారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని మనసులోని మాట బయటపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయన్నారు. అందుకే ఎన్నికలను నిష్పక్షపాతంగా సీఎం చంద్రబాబు జరగనివ్వరని చెప్పుకొచ్చారు.
స్థానిక ఎన్నికలను నేతలు లైటుగా తీసుకోవద్దని, బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని సలహా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ప్రలోభాలు చూశామని వివరించిన జగన్, నాయకుడు తనతో ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలన్నారు. మనం కార్యకర్తకు అండగా ఉంటే, సాధారణ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పని చేస్తారని తెలిపారు.
ఏ నియోజకవర్గంలో పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని తేల్చిచెప్పారు వైసీపీ అధినేత. ఏకగ్రీవాలు జరిగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థి కాలేరన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల తర్వాత నివేదికలు తెప్పించుకుంటామని అన్నారు. అభ్యర్థులను నిలబెట్టడమే కాదు, ఎంత బలంగా మద్దతిచ్చారనే దానిపై నివేదికలు తీసుకుంటామని తేల్చేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లకు స్థానిక సంస్థల ఎన్నికలు బిగ్ టాస్క్. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా ఏకగ్రీవాలకు మొగ్గుచూపారు జగన్. దానివల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, ఆయా నిధులను పంచాయితీలకు ఉపయోగించవచ్చని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల బరువు బాధ్యతలంతా కో-ఆర్డినేటర్లదేనని చెప్పకనే చెప్పేశారు అధినేత జగన్.








