AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైనా వేస్తున్న మాస్టర్ ప్లాన్..? చంద్రుడి సీక్రెట్ గుహల్లోకి దూకే విచిత్ర రోబో..!

చంద్రుడి దక్షిణ ధ్రువం… ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో కోట్ల ఏళ్లుగా సన్ లైట్ పడలేదు. దీంతో ఆ ప్రాంతాల్లో నీటి మంచు భద్రంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మంచు కోసం చైనా చేపడుతున్న మిషనే… చాంగ్‌ఈ-7.

లాంగ్ మార్చ్-5 రాకెట్‌తో ఈ మిషన్‌ను ప్రయోగించేందుకు చైనా సిద్ధమైంది. చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత… దిగేందుకు అనువైన ప్రాంతాలను పరిశీలించి, దక్షిణ ధ్రువం సమీపంలో ల్యాండ్ చేయనుంది. ఈ మిషన్‌లో కెమెరాలు, రాడార్లు, నీటి ఆనవాళ్లను గుర్తించే పరికరాలు ఉన్నాయి. అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది ఓ చిన్న రోబో. చక్రాలతో వెళ్లే రోవర్లు చేరుకోలేని లోతైన గుంతల్లోకి… ఈ రోబో చిన్న చిన్న జంప్‌లతో దూసుకెళ్లనుంది. అక్కడ నీటి అణువుల కోసం అన్వేషించి… తిరిగి వెలుతురు ఉన్న ప్రాంతాలకు చేరుకుని తన పవర్‌ను రీచార్జ్ చేసుకునేలా దీన్ని రూపొందించారు.

చంద్రుడి శాశ్వత చీకటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 203 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి. అలాంటి ప్రాంతాల్లో దొరికే నీటి మంచు… భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాలకు కీలకంగా మారొచ్చు. ఎందుకంటే నీటి మంచు నుంచి తాగునీరు, ఆక్సిజన్… చివరికి రాకెట్ ఇంధనం కూడా తయారు చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే భారత్‌ చంద్రమండల దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చైనా కూడా అదే ప్రాంతంలో మరింత లోతైన అన్వేషణకు సిద్ధమవుతోంది. చాంగ్‌ఈ-7 తర్వాత చాంగ్‌ఈ-8 మిషన్‌ ద్వారా మరింత పరిశోధనకు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ANN TOP 10