కర్నూలు: ప్రభుత్వం అందజేస్తున్న ల్యాప్టాప్లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి విలేజ్ సర్వేయర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సర్వే శాఖ నుంచి సరఫరా చేసిన 28 హెచ్పీ కంపెనీ ల్యాప్టాప్లను సర్వే పనుల కోసం విలేజ్ సర్వేయర్లకు పంపిణీ చేశారు. ఒక్కో ల్యాప్టాప్ విలువ రూ.1.53 లక్షలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే పనుల కోసం అందజేసిన ల్యాప్టాప్లను జాగ్రత్తగా వినియోగించడంతో పాటు వాటి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రీ సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నిర్వహించే ముందు ప్రజలకు ముందుగానే నోటీసులు జారీ చేసి, వారిని పిలిపించి వారి సమక్షంలోనే సర్వే ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణతో పాటు మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన సాంకేతిక పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రీ సర్వే ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.








