ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోదీ ఏపీ టూర్ షెడ్యూల్ విడుదలైంది. దాదాపు రెండున్నర గంటలపాటు భోగాపురం ఎయిర్పోర్టులో ఉండనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే ఆగష్టు 17న భోగాపురం ఎయిర్పోర్టు నుంచి సింగపూర్కు తొలి విమానం బయలుదేరనుంది.
శనివారం భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు శనివారం అనగా ఆగష్టు ఒకటిన ప్రారంభంకానుంది. ప్రధాని నరేంద్రమోదీ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టును ప్రారంభించనున్నారు. ప్రధాని టూర్కి సంబంధించి షెడ్యూల్ ఖరారు అయ్యింది. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టుకు ఉదయం 10.45 గంటలకు చేరుకుంటారు ప్రధాని నరేంద్రమోదీ. ఎయిర్పోర్టులో 10.45 నుంచి 10.50 గంటల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్
ఎయిర్ పోర్టు రన్ వే నుంచి 10.50 నుంచి 10.55 మధ్య కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10.55 నుంచి 10.58 మధ్య కూచిపూడి నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. 11.00 నుంచి 11.15 మధ్య భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను దగ్గరుండి మరీ ప్రధాని పరిశీలన చేస్తారు. 11.17 నుంచి 11.25 మధ్య టెర్మినల్ భవనం నుంచి ఓపెన్టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. 11.30 నుంచి 12.55 మధ్య విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించారు.
ప్రధాని రెండున్నర గంటలు
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 నుంచి 1.10 మధ్య భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ప్రధాని పర్యటన వ్యవధి సుమారు 2 గంటల 25 నిమిషాలు మాత్రమే. ఇక ఎయిర్పోర్టు వద్ద ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రదర్శన కోసం 13,000 మందితో ధింసా నృత్యం చేయనున్నారు.
30 వేల మొక్కలతో సృజనాత్మకంగా ప్రధానికి స్వాగతం చెప్పేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఆరు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వేడుక చూసేందుకు లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా పనులు చకచకా చేపట్టారు. భోగాపురంలో జరిగే సభకు దాదాపు 4800 బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
రెండు వేల ఆర్టీసీ బస్సులు కాగా, మరో 2,800 ప్రైవేటు బస్సులు సిద్ధం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల ప్రజలు రానున్నారు. పీఎం మోదీ భారీ బహిరంగసభ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎన్హెచ్ మీదుగా రావొద్దని విజయనగరం జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భోగాపురం టు సింగపూర్ తొలి విమానం:
ఆగష్టు 17 నుంచి భోగాపురం ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. 17న అర్ధరాత్రి భోగాపురం నుంచి సింగపూర్కు తొలి విమానం బయలుదేరనుంది. ఆగస్టు 16న సింగపూర్ నుంచి విశాఖకు విమానం రానుంది. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.








