కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పటివరకు ఎలాంటి అవకతవకలు లేకుండా దాదాపు 12.75 లక్షల మంది అర్హులైన యువతకు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల భర్తీ సరిగా జరగకపోగా, అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే బాటలో పయనిస్తున్నాయన్నారు. ‘దోస్త్ మేరా దోస్త్’ అనే బంధం ఆ రెండు పార్టీలకే సరిగ్గా సరిపోతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం భూకబ్జాలకు పాల్పడిందని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. అయితే, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బస్సుల్లో ఫామ్హౌస్కు పంపిస్తూ టైమ్పాస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన మిత్రుడిని కాపాడేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సరికొత్త నాటకాలు ఆడుతున్నారని, సత్యం భూముల్లో లీజుల వ్యవహారంతో పాటు హుస్సేన్ సాగర్ FTL భూములను ధారాదత్తం చేశారని మండిపడ్డారు. తెలంగాణ పేరు చెప్తూ ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం సహకారంతో, ముస్లిం ఓటు బ్యాంకును నమ్ముకుని గెలవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. రాబోయే రోజుల్లో BRS, కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో 22A నిబంధన పేరుతో పేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ భూముల్లో పట్టాలు ఎలా ఇస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.








