AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇసుక నేలపై కాళేశ్వరం పునాది.. కట్టిన వారానికే లీకేజీ.. మంత్రి ఉత్తమ్ ఫైర్..

కాళేశ్వరం కట్టిన వారం రోజుల్లోనే లీకేజీ జరిగిందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కేసీఆర్ సైతం తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సహా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు. సుమారు మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్ల వడ్డీ కడుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

 

దిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ పిచ్చి రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు. తాము కాళేశ్వరంపై ఎలాంటి పాలిటిక్స్ చేయడం లేదన్నారు. కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. అయితే ఇసుక నేలపై కాళేశ్వరానికి పునాది వేసినట్లు మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా ఆరోపించారు.

 

దీనికి సంబంధించి ఐఐటీ బాంబే ఆఫ్రి కంపెనీతో సాయిల్ టెస్ట్ చేయించినట్లు మంత్రి తెలిపారు. బ్యారేజీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని.. వాటిని ఓపెన్ చేస్తే ప్రజలకు ఏమైనా జరగొచ్చని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ కాసుల కక్కుర్తి, అసమర్ధత వలన కాళేశ్వరం కూలిపోయిందని మరోమారు మంత్రి పునరుద్ఘటించారు.

 

మరోవైపు కాళేశ్వరం నుంచి చుక్క నీటిని వాడకుండానే దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారమంతా బూటకమన్నారు. ‘మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంపు హౌస్ 18 కిలోమీటర్ల దూరం ఉంది. అన్నారం బ్యారేజ్ కి రంధ్రాలు ఉన్నాయని CWPRS రిపోర్ట్ ఇచ్చింది. NDSA మొదట ప్రిలిమినరీ రిపోర్ట్ నవంబర్ 23 ఇచ్చింది’ అని మంత్రి గుర్తుచేశారు.

 

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు రూ.1400 కోట్లు చెక్ రూపంలో బీఆర్ఎస్ కు ఇచ్చారని ఆమె చెప్పడం వాస్తవమని అన్నారు. మరోవైపు తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. అటు SLBC టన్నెల్ ను తమ హయంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ఛాలెంజ్ చేశారు.

ANN TOP 10