AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సింగరేణిని నాశనం చేశారు.. KCR, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి..!

కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో తెలంగాణలోని కాంగ్రెస్, గత బిఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సింగరేణి సంస్థ పరిస్థితి , రాబోయే అభివృద్ధి కార్యక్రమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి..

తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ కావడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారని, ఆయన హయాంలోనే ఇలాంటి లీకేజీలు జరగడం పట్ల నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇతరులకు నీతులు చెప్పడం తగదని ఆయన విమర్శించారు.

 

నేషనల్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్

దేశ భద్రత, ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘నేషనల్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్’ అనేది తమ ప్రాథమిక సిద్ధాంతమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటి ఏ నిర్ణయమైనా దేశ ప్రయోజనాల కోసమే తీసుకున్నామని చెప్పారు. దేశానికి నష్టం కలిగించే ఏ వ్యవస్థనూ సహించేది లేదని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం అవసరమైతే ఏ వ్యవస్థ వచ్చినైనా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా, పేదరికం ఉన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని కొనియాడారు.

 

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది

 

భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర పెద్దలు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తారని తెలిపారు. వరంగల్ విమానాశ్రయానికి త్వరలోనే భూమి పూజ చేయబోతున్నామని, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్లానింగ్ వేగంగా జరుగుతోందని వివరించారు.

 

సింగరేణిని నాశనం చేసిన బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు

 

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి కాలరీస్ గురించి మాట్లాడూతూ.. ఈ సంస్థ నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు ఎన్టీపీసీకి భారీగా బొగ్గు సరఫరా అవుతోందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 49 శాతం, తెలంగాణ ప్రభుత్వం 51 శాతం వాటాలతో ఈ సంస్థ నడుస్తోందని చెప్పారు.

 

గత కేసీఆర్ ప్రభుత్వం పొలిటికల్ వేదికగా సింగరేణిని వాడుకుని, దాని ఆదాయానికి గండికొట్టి తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించకుండా నష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. అయితే, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ANN TOP 10