AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ..

పశ్చిమ బెంగాల్‌లో అధికార పీఠాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం తీవ్రతరమవుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశంలో తిరుగుబాటు ఎంపీ శతాబ్ది రాయ్ సైతం పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

 

ఇటీవల వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఓటమి పాలవగా, బీజేపీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పార్టీలో మొదలైన విభేదాలు ఇప్పుడు పార్లమెంటు స్థాయికి చేరాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు, బీజేపీలో విలీనం కాకుండానే ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని తిరుగుబాటు వర్గం భావిస్తోంది. కాకోలీ ఘోష్ దస్తీదార్ వంటి నేతల నేతృత్వంలో తామే అసలైన టీఎంసీ అని ఈ వర్గం వాదిస్తోంది.

 

తిరుగుబాటు ఎంపీ జగదీష్ బసునియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ బృందం ఆదివారం ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని, సోమవారం (జూన్ 15న) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనుంది. సభలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని వారు స్పీకర్‌ను కోరనున్నారు.

 

తొలుత ప్రచారంలో ఉన్న 19 మంది తిరుగుబాటు ఎంపీల జాబితాలో సుదీప్ బందోపాధ్యాయ పేరు లేదు. అయితే, కేంద్ర మంత్రితో ఆయన నేరుగా సమావేశం కావడంతో పార్టీలో చీలిక లోతుగా ఉందనే విషయం స్పష్టమవుతోంది. అయితే, సుదీప్ తీరుపై టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

మరోవైపు, పార్టీ విధేయ వర్గంలోని కొందరు నేతలు ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించిన కల్యాణ్ బెనర్జీ, తాజాగా ఆయనను “నా కొడుకు వంటివాడు” అంటూ స్వరం మార్చారు.

ANN TOP 10