AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్ స్టేట్‌మెంట్స్ రికార్డ్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ల వాంగ్మూలాలను శనివారం రికార్డు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలోని సిట్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కోర్టుకు తుది ఛార్జ్ షీట్ సమర్పించాలని భావిస్తున్న అధికారులు కొద్దిరోజులుగా దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లి స్టేట్మెంట్ తీసుకున్నారు.

 

తుమ్మల అనుచరులను వదల్లేదు!

2014లో తుమ్మల బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా గుర్తించిన అధికారులు ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. మంత్రి తుమ్మలతోపాటు ఆయన సన్నిహితులు, ప్రధాన అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు విచారణలో వెళ్లడయినట్టు తెలిసింది. ఇక ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్టు గుర్తించిన సిట్ అధికారులు విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ శనివారం బంజారాహిల్స్ లోని ఐసీసీసీకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు గంటపాటు అధికారులు ఆయన నుంచి వివరాలు తీసుకున్నారు.

 

బీఆర్ఎస్ నీచ రాజకీయం: ఎంపీ

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ నా ఫోన్ ట్యాప్ అయినట్లుగా గుర్తించి పోలీసులు విచారణకు పిలిచారని చెప్పారు. ఏ రోజు.. ఏ టైమ్ లో ఫోన్ ట్యాప్ చేశారో అన్న వివరాలను చూపించి ప్రశ్నించినట్టు తెలిపారు. అప్పట్లో టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను, కార్యక్రమాలను తాము ఆర్గనైజ్ చేసేవాళ్లమని అన్నారు. తాము ఏదైనా కార్యక్రమం తలపెట్టి ఇంటి గడప దాటలోపే ఇంటిముందు పోలీసులు ఉండేవాళ్లన్నారు. అప్పట్లో పోలీసులకు ఎలా తెలిసింది అన్నది తమకు అర్థం అయ్యేది కాదన్నారు. ఇప్పుడు పోలీసులు చెబితే తెలిసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించి బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని ఎంపీ అనిల్ విమర్శించారు. తనతోపాటు తన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ ఫోన్ కూడా ట్యాప్ చేసారని చెప్పారు.

 

మరో ఇద్దరు మంత్రులు సైతం..

కాగా, సిట్ అధికారులు త్వరలోనే మరో ఇద్దరు మంత్రుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి నుంచి కూడా సాక్షులుగా వాంగ్మూలాలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.

ANN TOP 10