AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

14,400 ఏళ్ల క్రితం ఆదిమానవుల తెలివి..! పరిశోధనల్లో బయటపడ్డా నిజాలు..!

సుమారు 14,400 ఏళ్ల క్రితం, చివరి మంచు యుగం ముగిసే సమయంలో ఐదుగురు ఆదిమానవులు ఇటలీలోని ఓ చీకటి గుహ లోపలికి వెళ్లారు. అయితే వారు పెద్ద పెద్ద కాగడాలు పట్టుకుని వెళ్లలేదని, కేవలం చిన్న పైన్ చెట్టు కొమ్మలను వెలిగించుకుని లోపలికి ప్రవేశించారని తాజా అధ్యయనంలో తేలింది. ఇటలీలోని బసురా గుహలో జరిపిన ఈ పరిశోధన.. ఆదిమానవుల తెలివితేటలకు, వారి వనరుల వినియోగానికి అద్దం పడుతోంది.

 

వాయువ్య ఇటలీలోని బసురా గుహలో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల వివరాలను ‘క్వాటర్నరీ ఇంటర్నేషనల్’ జర్నల్‌లో ప్రచురించారు. గతంలో ఈ గుహలో ఇద్దరు పెద్దలు, ఓ కౌమారదశ బాలుడు, ఇద్దరు పిల్లలతో పాటు ఓ శునకం పాదముద్రలను గుర్తించారు.

 

తాజాగా ‘హాల్ ఆఫ్ మిస్టరీస్’ అనే ప్రాంతంలో దొరికిన 56 బొగ్గు శకలాలను విశ్లేషించగా, వాటిలో ఎక్కువ భాగం ‘పైనస్ సిల్వెస్ట్రిస్’ (స్కాట్స్ పైన్) జాతికి చెందిన చిన్న కొమ్మలని తేలింది. ఈ కొమ్మల వ్యాసం 2-3 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంది. ఇరుకైన గుహలో పెద్ద కాగడాలు వాడితే పొగ ఎక్కువగా రావడం, ఆక్సిజన్ త్వరగా అయిపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అందుకే వారు చిన్న పుల్లలను ఎంచుకుని ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు.

 

ఈ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు, పరిశోధకులు అదే తరహా వాతావరణంలో ప్రయోగాలు చేశారు. పైన్ చెట్టు పుల్లలను వెలిగించి చూడగా, కేవలం రెండు పుల్లల కాంతే ఐదుగురు సభ్యుల బృందానికి సరిపోతుందని గమనించారు. ఈ వెలుతురులో సుమారు 10 మీటర్ల దూరం వరకు చూడవచ్చని గుర్తించారు. రెండు గంటల పాటు గుహలో ప్రయాణించడానికి 30 సెంటీమీటర్ల పొడవున్న 20 పుల్లలు సరిపోతాయని అంచనా వేశారు. బృందంలో ఒకరు ముందు, మరొకరు వెనుక వెలుతురు పట్టుకుని మధ్యలో ఉన్నవారు ఒకరినొకరు పట్టుకుని నడిచినట్లు భావిస్తున్నారు.

 

1950ల నుంచి బసురా గుహపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలుగుబంట్ల అవశేషాలు కూడా లభించాయి. నాటి వాతావరణ పరిస్థితులు, పుప్పొడి రేణువుల ఆధారంగా ఆ ప్రాంతంలో పైన్ అడవులు ఉండేవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చీకటి గుహల్లోకి సురక్షితంగా వెళ్లి, తిరిగి రావడం కోసం ఆదిమానవులు ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించారో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందని పరిశోధకులు తెలిపారు.

ANN TOP 10