మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సినీ ప్రియులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్కు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు, స్పెషల్ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
జూన్ 3నే స్పెషల్ షో..
ఈ ఉత్తర్వుల ప్రకారం, సినిమా విడుదల కంటే ఒక రోజు ముందే, అంటే జూన్ 3 (బుధవారం) రాత్రి 8:00 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ప్రదర్శన వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాత్రి స్పెషల్ షోకు సంబంధించిన టికెట్ ధరను GSTతో కలిపి రూ. 600/- గా నిర్ణయించారు.
10 రోజుల పాటు పెరిగిన టికెట్ రేట్లు
ఇక జూన్ 4న సినిమా విడుదలైనప్పటి నుండి మొదటి 10 రోజుల పాటు (జూన్ 13 వరకు) ప్రతిరోజూ గరిష్టంగా 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి లభించింది. ఈ 10 రోజుల్లో టికెట్ ధరల పెంపు ఇలా ఉండనుంది:
సింగిల్ స్క్రీన్స్: సాధారణ ధర కంటే అదనంగా రూ. 100/- పెంచుకోవచ్చు (GSTతో కలిపి).
మల్టీప్లెక్స్లు: సాధారణ ధర కంటే అదనంగా రూ. 125/- పెంచుకోవచ్చు (GSTతో కలిపి).
సినీ కార్మికుల సంక్షేమానికి 20% విరాళం
ఈ జీవోలో ప్రభుత్వం ఒక కీలకమైన నిబంధనను పెట్టింది. టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్” ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించింది. చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకు, వారి సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చూసుకోనుంది.
థియేటర్లలో సామాజిక అవగాహన ప్రకటనలు
దీంతో పాటు, సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్, నార్కోటిక్స్ వినియోగం మరియు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనకు ముందు వీటికి సంబంధించిన హెచ్చరిక ప్రకటనలను తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలన్నీ థియేటర్లు కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, పోలీస్ కమీషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ బూస్ట్తో తెలంగాణలో ‘పెద్ది’ జాతర ఒక రోజు ముందే ప్రారంభం కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.







