తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయా? ఎలాగైనా విజయ్కు ముఖ్యమంత్రి పీఠం దక్కకుండా డీఎంకే-అన్నాడీఎంకే పార్టీలు పావులు కదుపుతున్నాయా? గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానిస్తే విఫలమయ్యేలా డీఎంకే-అన్నాడీఎంకే పార్టీలు పావులు కదుపు తున్నాయా? ఆ తర్వాత ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తమిళనాట రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు
దేశంలో పాతతరం రాజకీయాలకు కాలం చెల్లింది. గతంలో తేడా వస్తే మంత్రులు, సీఎం, ప్రధానులు రాజీనామాలు చేసేశారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త కొత్త పార్టీలు రావడంతో దిగ్గజ పార్టీలు ఊహించని విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్ తమిళనాట రాజకీయాలు. అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్కు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడంతో అక్కడి పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన పెద్ద పార్టీకి అవకాశం ఇవ్వాలని పైకి డీఎంకె బలంగా చెబుతోంది. అందుకు కారణాలు వేరే ఉన్నాయనుకోండి. పద్దతి ప్రకారం ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ను ఒకవేళ గవర్నర్ ఆహ్వానిస్తే.. ఈ విధంగా వ్యవహారించాలనే దానిపై డీఎంకే-అన్నాడీఎంకే ముఖ్యనేతలు గురువారం రోజంతా మంతనాలు జరిపారు.
ప్లాన్ బీకి సిద్ధమైన డీఎంకే-అన్నాడీఎంకే పార్టీలు
గెలుపొందిన ఎమ్మెల్యేలతో గురువారం కీలక నేతలు సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసినట్టు చెన్నై పొలిటికల్ వర్గాల మాట. బల నిరూపణలో విజయ్ విఫలమయ్యేలా పావులు తెర వెనుక కదుపుతున్నాయి. ఆ తర్వాత డీఎంకే-అన్నాడీఎంకే పార్టీలు కలిసి ఉమ్మడి సర్కార్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
డీఎంకేతో చేతులు కలిపేందుకు అన్నాడీఎంకే రెడీ అయ్యింది. ఎందుకంటే గడిచిన ఐదేళ్లు అధికారానికి ఆ పార్టీ దూరంగా ఉండడం కూడా అందుకు కారణమైంది. దీనికితోడు రెండు కూటముల్లోని చిన్న పార్టీలు మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు తాము సిద్ధమేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
మరోవైపు డీఎంకే చీఫ్ స్టాలిన్ను ఒప్పించేందుకు ఆ పార్టీలోని కొందరు నేతలు ప్రయత్నాలు చేశారు. నేతల రిక్వెస్టుతో ఆయన దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కూటమి నేతలతో డీఎంకే అధినేత స్టాలిన్ భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటామని, దానికి అందరూ కట్టుబడాల్సిందే పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ తేల్చి చెప్పినట్టు సమాచారం.
విజయ్ ప్రభుత్వం బలపరీక్షలో వీగిపోయిన తర్వాత 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి గవర్నర్ను కలవనున్నారు. ఆ తర్వాత అద్భుతం జరుగుతుందని ఆ పార్టీ నేత అన్బళగన్ తెలిపారు. మద్దతు విషయంలో స్టాలిన్ నిర్ణయిస్తే ఓకేనని మరొక నేతల ఇళంగోవన్ అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలు విజయ్ వైపు వెళ్లకుండా కట్టడి చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేది లేనిది సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు శుక్రవారం తమ నిర్ణయాన్ని చెబుతాయని అన్నారు. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. అంతకుముందు ఈ మూడు పార్టీల నేతలు మాజీ సీఎం స్టాలిన్తో భేటీ అయిన విషయం తెల్సిందే.








