పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్. రవి గురువారం సాయంత్రం సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 174, క్లాజ్ (2), సబ్-క్లాజ్ (b) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్ భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 8, 2026 నుంచే ఈ రద్దు ఉత్తర్వులు అమలులోకి వస్తాయని స్పష్టం చేయడంతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అయితే, ఎన్నికల్లో ఓట్ల లూటీ జరిగిందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయని సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో గవర్నర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విజయం సాధించినప్పటికీ.. సువేందు అధికారి పీఏ హత్య వంటి వరుస ఘటనలు శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పట్టాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ యంత్రాంగం సజావుగా సాగే అవకాశం లేదని భావించిన గవర్నర్.. అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోక్ భవన్ నుంచి వెలువడిన ఈ అధికారిక ప్రెస్ రిలీజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.








